ASADYAM-SUSADYAM
కొన్ని వందల ఏళ్ళ క్రిందట ఇటలీ దేశంలోని ఒక పట్టణం లో ఒక వ్యాపారస్థుడు ఉండేవాడు. అతని దురదృష్టం కొద్దీ ఒక వడ్డీ వ్యాపారికి పెద్ద మొత్తంలో సొమ్ము బాకీ పడ్డాడు. ఆ వడ్డీ వ్యాపారి ముసలై వాడైనా మంచి జిత్తుల మారి. అతనికి తనకి బాకీ ఉన్న వ్యాపారి కూతుర్ని ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. దాంతో అతని కూతుర్ని తనకిచ్చి వివాహం జరిపిస్తే అప్పు మొత్తాన్నీ మాఫీ చేస్తానని ప్రతిపాదన చేశాడు. ఆ వ్యాపారి, అతని కూతురికీ ఈ ప్రతిపాదన వినగానే చాలా భయం వేసింది.
ఆ వడ్డీ వ్యాపారి పందెం ఇలా ఉంది. అతను ఒక ఖాళీ సంచీ లో ఒకే పరిమాణం, ఆకృతిలో ఉండే ఒక తెల్ల రాయి, ఒక నల్ల రాయి వేస్తాడు. ఆ అమ్మాయి ఆ రెండు రాళ్ళలో ఒకటి బయటికి తీయాలి. ఒక వేళ ఆమె నలుపు రాయి బయటికి తీస్తే అతన్ని పెళ్ళి చేసుకోవాలి. ఆమె తండ్రి అప్పు చెల్లించనవసరం లేదు. ఒక వేళ ఆమె తెల్ల రాయి బయటికి తీస్తే ఆమె అతన్ని పెళ్ళి చేసుకోనక్కర్లేదు కానీ తండ్రి బాకీ పడ్డ సొమ్ము చెల్లించనక్కర్లేదు. కానీ ఆమె రాయి తీయనంటే మాత్రం ఆమె తండ్రి జైలు పాలు కావాల్సి ఉంటుంది.
వాళ్ళు ముగ్గురూ వ్యాపారి ఇంట్లో ఉన్నారు. వాళ్ళు నిల్చున్న దారిలో రకరకాల రాళ్ళున్నాయి. వాళ్ళలా మాట్లాడూతూ వెళుతుండగా ఆ వ్యాపారి రాళ్ళు తీసుకోవడానికి కిందికి వంగాడు. అలా తీస్తుండగా అతను రెండూ నల్ల రాళ్లనే తీసుకుని సంచిలో వేయడం ఆ అమ్మాయి గమనించింది. తర్వాత ఆ అమ్మాయిని ఏదో ఒక రాయిని బయటికి తీయాల్సిందిగా కోరాడు.
ఇప్పుడు ఆ అమ్మాయికి ఉన్న అవకాశాలు ఇవి.
- ఒక వేళ ఆ అమ్మాయి రాయి తీయనని నిరాకరిస్తే తండ్రి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది.
- ఆ అమ్మాయి రెండు రాళ్ళనీ బయటికి తీసి అందరికీ చూపించి అతన్ని మోసగాడని నిరూపించడం.
- ఏదో ఒక రాయిని (నలుపు) బయటికి తీసి అతన్ని పెళ్ళి చేసుకుని తండ్రిని అప్పుల్లోంచి కాపాడటం.
“అయ్యయ్యో.. రాయి కింద పడిపోయింది” అంది ఆమె బాధ నటిస్తూ.
“కానీ నేనేం రంగు రాయి తీశానో తెలుసుకోవాలంటే ఒక మార్గం ఉంది. ఇప్పుడీ సంచీ లో ఉన్న రాయిని తీసి చూస్తే అదే రంగులో ఉంటుందో అందుకు వ్యతిరేకంగా ఉన్న రాయి నేను తీసినట్లు లెక్క” అంది ఏ మాత్రం తొణక్కుండా…
సంచీలో ఇక మిగిలింది కూడా నల్ల రాయే కాబట్టి, ఆమె తీసింది ఖచ్చితంగా తెల్లరాయేనని ఒప్పుకుని తీరాలి. ఆ వడ్డీ వ్యాపారి తను మోసం చేశానని ఒప్పుకునే ధైర్యం లేదు. విధిలేక అతను తన బాకీ మొత్తం రద్దు చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
అతను తనను పెళ్ళి చేసుకోకుండా చూడటం, తండ్రి అప్పును మాఫీ చేయడం ఒకేసారి చేయడం దాదాపుగా అసాధ్యం. చూశారా తెలివితేటలతో ఆ అమ్మాయి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిందో…
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
రెండు కప్పల కథ
ఓ కప్పల గుంపు ఓ అడవి గుండా ప్రయాణిస్తూ ఉంది. ఆ గుంపులో నుండి రెండు కప్పలు అకస్మాత్తుగా ఓ లోతైన గోతిలో పడిపోయాయి. మిగతా కప్పలన్నీ ఆ గొయ్యి చాలా లోతైందని గ్రహించి ఆ రెండు కప్పలతో “మీరు ఇక బయటికి రాలేరు. ఒకవేళ బయటికి రావాలని ప్రయత్నించినా కిందపడి చనిపోతారు. కాబట్టి అక్కడే ఉండిపోండి” అన్నాయి.
ఆ రెండు కప్పలు మాత్రం వాటి మాటలు పట్టించుకోకుండా వాటి శక్తి కొద్దీ బయటికి దుమకడానికి ప్రయత్నిస్తున్నాయి. మిగతా కప్పలు వాటిని బయటికి రావడానికి ప్రయత్నించవద్దనీ, లోపలే ఉండిపోమనీ అరుస్తున్నాయి. చివరికి వాటిలో ఒక కప్ప మిగతా కప్పల మాటలు విని ప్రయత్నించడం ఆపేసింది. కిందపడి చనిపోయింది.
రెండో కప్ప మాత్రం తన శక్తినంతా ఉపయోగించి పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. పైనున్న కప్పల గుంపు ఇంకా రావద్దని, కిందపడి చనిపోతావని అరుస్తూనే ఉన్నాయి. ఆ కప్ప బలంగా ప్రయత్నించి ఎలాగోలా బయటికి వచ్చేసింది. అది బయటకు వచ్చేసిన తర్వాత మిగతా కప్పలన్నీ
“అసలు మేం అరుస్తుంటే విన్నావా?” అని అడిగాయి.
అప్పుడా కప్ప “నాకు చెవుడు. మీరేం చెబుతున్నారో సరిగ్గా అర్థం కాలేదు. కానీ నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారని మాత్రం అర్థమైంది.అందుకనే బయటకి రాగలిగాను” అన్నది.
@@@@@@@@@@@@@@@@@@@@@@@
స్పూర్తికి నిలువెత్తు నిదర్శనం:
అతను ఓ పేద కుటుంబం నుంచి వచ్చాడు. విధి అతని మీద పగబట్టింది. అయినా అతను క్రుంగిపోలేదు. పట్టుదలతో చదివి ఐఐటీలో సీటు సంపాదించాడు. తర్వాత ప్రతిష్టాత్మకమైన గూగుల్ లో ఉద్యోగం సంపాదించాడు. నిజ్జంగా అతను స్పూర్తికి నిలువెత్తు నిదర్శనం.
ఎవరతను? ఏమా కథ? వివరాల్లోకి వెళితే…

నాగ నరేష్
నరేష్ కో ప్రత్యేకత ఉంది. అతను పైన చెప్పిన వేలమందిలో ఒక్కడు కాడు. అతని తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. అతనికి రెండు కాళ్ళు లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా చక్రాల కుర్చీయే గతి. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. గొప్ప ఆశావాది. ” భగవంతుడు నాకోసం అన్నీ ముందుగా ఏర్పాటు చేసేస్తుంటాడు. అందుకనే నేను చాలా అదృష్టవంతుణ్ణని భావిస్తాను. ” అంటుంటాడు. అసలు నరేష్ ఎలా అదృష్టవంతుడెలా అయ్యాడో అతని మాటల్లోనే…
***
బాల్యం ఓ కుగ్రామంలో
నా మొదటి ఏడేళ్ళు గోదావరి ఒడ్డున ఉన్న తీపర్రు అనే కుగ్రామంలో గడిచాయి. మా నాన్న పేరు ప్రసాద్. లారీ నడిపేవాడు. అమ్మ కుమారి గృహిణి. వాళ్ళిద్దరూ నిరక్షరాస్యులే అయినా నన్ను, మా అక్కను బాగా చదువుకోమని ఎంతగానో ప్రోత్సహించేవారు.ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటంటే నేను ఒకటి రెండు తరగతులు చదివేటపుడు మా నాన్న నాకు సహాయం చేయడం. నాన్న పాఠ్య పుస్తకంలో ప్రశ్నలు అడుగుతుంటే నేను సమాధానాలు చెప్పేవాడిని. అప్పుడు మా నాన్నకు చదవడం, రాయడం తెలీదని నాకు తెలియదు, కానీ నన్ను సంతోష పెట్టడం కోసం అలా చేసేవాడు. నా జ్ఞాపకాల్లోంచి చెరిగిపోని మరో సంఘటన మా ఊళ్ళో వరదలు. అప్పుడు మా మామ నన్ను ఓ గేదె పై కూర్చోబెట్టి తీసుకెళ్ళడం, బాగా ముళ్ళున్న చెట్టు నుంచి ఏవో పండ్లు తీసుకొచ్చి నాకివ్వడం నా కింకా బాగా గుర్తు.
నేను చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడ్ని. ఎప్పుడూ అటూ ఇటూ పరిగెడుతూ, సావాస గాళ్ళతో ఆడుకుంటూ భలే సరదాగా ఉండేవాడిని. అలా అరుస్తూ మధ్యాహ్నం పూట నిద్ర చెడగొట్టినందుకు పెద్దవాళ్ళ దగ్గర అప్పుడప్పుడూ తిట్లు కూడా తింటుండేవాణ్ణి. ఎప్పుడైతే వాళ్ళు నా మీద అరుస్తారో వెంటనే పొలాలవైపు పరిగెత్తేవాణ్ణి.
మాస్టారు తరగతిలో అప్పజెప్పిన పనిని అందరికన్నా నేనే ముందు పూర్తి చేసేసి ఉపాధ్యాయుల ఒళ్ళో నిద్రపోయేవాణ్ణి!
జనవరి 11, 1993, విధి వెక్కిరించిన రోజు
జనవరి 11, 1993 మాకు సంక్రాంతి సెలవులు. మా అమ్మ నన్ను, అక్కను పక్క ఊళ్ళో జరుగుతున్న ఓ కార్యం కోసం తీసుకుని వెళుతోంది. అక్కడి నుంచి మా అమ్మమ్మతో కలిసి ఊరికి వెళ్ళాలనేది మా ప్లాను. కానీ మా అమ్మమ్మ అక్కడికి రాలేదు. ఆ రోజు బస్సులు లేకపోవడంతో తిరుగు ప్రయాణంలో మేం మా నాన్న లారీ లో ఎక్కాం. అప్పటికే లారీలో చాలా మంది ఉండటంతో మా నాన్న నన్ను డ్రైవర్ సీటు పక్కనే తలుపు కి దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు.
అది నా తప్పే; నేను తలుపుని ఏదో కలిబెట్టాను. అది ఊడిపోయి అక్కడి నుంచి కిందపడ్డాను. కిందపడి దొల్లడం వల్ల లారీలో వేసుకువస్తున్న ఇనుప కమ్మీలు వెనుకల బాగం తగిలి నా కాళ్ళు బాగా చీరుకుపోయాయి.
ఈ ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఎదురుగా ఓ పెద్ద ప్రైవేటు ఆసుపత్రి కూడా ఉంది. కానీ యాక్సిడెంటు కేసు కావడంతో నన్ను అక్కడ చేర్చుకోలేదు. అటుగా వెళ్తున్న ఓ పోలీసు కాన్స్టేబుల్ మా పరిస్థితి చూసి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళాడు.
అక్కడ నా చిన్న ప్రేగు మెలితిరిగిందని తెలియడంతో మొదటగా ఓ శస్త్రచికిత్స చేశారు. నా కాళ్ళకు కూడా కట్లు కట్టారు. అక్కడే ఓ వారం రోజులు ఉన్నాను. కొన్నాళ్ళకి నా గాయాలు సెప్టిక్ అయి మోకాళ్ళ దాకా పాకినట్లు గుర్తించారు. నన్ను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్ళమని మా నాన్నకు తెలియజేశారు. అక్కడ వైద్యులు గాయాన్ని అంత కాలం నిర్లక్ష్యం చేసి సెప్టిక్ అయ్యేదాకా ఆలస్యం చేసినందుకు బాగా కోప్పడ్డారు. కానీ ఇలాంటి విషయాలు పెద్దగా తెలియని వాళ్ళేం చేస్తారు?
కొద్ది రోజులకు నా రెండు కాళ్ళు నడుం దాకా తొలగించారు. నా కింకా బాగా గుర్తుంది, స్పృహ లోకి వచ్చింతర్వాత మా అమ్మను అడిగాను ” నా కాళ్ళేవి?” అని. ఆమె కన్నీరు మున్నీరైంది. అలా నేను మూడునెలలు ఆసుపత్రిలోనే ఉన్నాను.
కాళ్ళులేని జీవితం
నాకు కాళ్ళు పోయింతర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయిందని నేననుకోను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు నన్ను ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. అందరూ నా మీద చూపే శృద్ధకు లోలోపలే ఆనందిస్తున్నానే గానీ నన్ను గురించి నేను బాధపడటం లేదు. నేను తినడానికి పళ్ళు, బిస్కట్లు బాగా దొరుకుతున్నాయని సంతోషంగా అనిపించేది.
ఆత్మన్యూనతా?… అంటే ఏమిటి?
నేను మా ఊరు వెళ్ళగానే మా ఇంటికి చూడ్డానికి వచ్చేవాళ్ళు వెల్లువలా వచ్చిపడ్డారు. వాళ్ళలో చాలామంది కాళ్ళు లేకుండా నేనెలా ఉంటానో చూడ్డానికి వచ్చిన వాళ్ళే. కానీ నాకేం బాధ లేదు. చాలా మంది, ముఖ్యంగా నా స్నేహితులంతా నన్ను చూడ్డానికి వస్తున్నారని సంతోషంగా ఉండేది.
నా స్నేహితులంతా ఏ ఆట ఆడుకున్నా అందులో నేనుండేటట్టుగా చూసేవారు. ఎక్కడికైనా మోసుకుపోయేవారు.
నేను భగవంతుణ్ణి నమ్ముతాను. అలాగే విధి అంటే కూడా నమ్మకమే. భగవంతుడు నాకోసం అన్నీ ముందుగానే ఏర్పాటు చేస్తాడనుకుంటా. ఆ యాక్సిడెంటు జరక్కుంటే మేం మా గ్రామాన్ని వదిలి తణుకు పట్టణానికి వెళ్ళుండే వాళ్ళమే కాదు. అక్కడ నేనో మిషనరీ స్కూల్లో చేరాను. మా నాన్న ఆ స్కూలు పక్కనే ఓ ఇల్లు కూడా కట్టాడు. నా పదో తరగతి దాకా అక్కడే చదివాను.
నేను తీపర్రు లో ఉండిపోయుంటే పదో తరగతికి మించి చదువుండే వాణ్ణి కాదేమో! అందరి లాగానే పదో తరగతి పూర్తి చేసి వ్యవసాయంలో స్థిరపడిపోయి ఉండేవాణ్నేమో! దైవం వేరొకటి తలచిందేమో నాకోసం.
మా అక్క
బడి మళ్ళీ తెరుస్తారనగా మా అమ్మ, నాన్న తీపర్రు నుంచి తణుకు కి వచ్చేశారు. మమ్మల్నిద్దర్నీ ఓ మిషనరీ స్కూల్లో చేర్పించారు. నా కన్నా మా అక్క రెండేళ్ళు పెద్దదైనా నాకు సహాయంగా ఉండి బాగా చూసుకుంటుందని నా క్లాసులోనే చేర్పించారు. మా అక్క ఏ మాత్రం సంకోచించలేదు, ఫిర్యాదు చేయలేదు.
ఆమె నా కోసం ఏం చేయడానికైనా వెనుకాడేది కాదు. మా స్నేహితులంతా అంటుండే వారు అలాంటి అక్క ఉండటం నా అదృష్టమని. తోబుట్టువుల్ని పట్టించుకోని చాలా మంది ఉన్న ఈ లోకం లో అది అక్షరాలా నిజం.
కొన్ని సంవత్సరాలు మా అక్కే నన్ను మోసుకొని స్కూలుకి తీసుకెళ్ళేది. తర్వాత నా స్నేహితులు ఆ బాధ్యత తీసుకున్నారు. నాకు మూడు చక్రాల బండి వచ్చాక మా అక్కే వెనకుండి తోసుకుంటూ తిరిగేది.
అందరూ నన్ను వాళ్ళతో సమానంగా చూడటం వల్లనేమో నేను కూడా అందరిలాంటి వాడినే అనుకునే వాణ్ణి. ఎప్పుడూ ఆత్మన్యూనతా భావంతో కుంగిపోలేదు. అందరిలానే సంతోషంగా ఉంటూ మొదటి స్థానం కోసం అందరితో పోటీ పడేవాణ్ణి. అలాగే అందరు కూడా నన్ను గట్టి పోటీగా స్వీకరించేవాళ్ళు.
స్పూర్తి
స్కూల్లో ఉండగా నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు ఇద్దరు. ఒకరు మా గణితం మాస్టారు ప్రమోద్ లాల్. ఆయన ప్రాంతీయంగా జరిగే ప్రతిభా పరీక్షల్లో (టాలెంట్ టెస్ట్) ల్లో నన్ను పాల్గొనమనేవాడు. ఇంకొకరు నాకు సీనియర్ అయిన చౌదరి. అతను గౌతమ్ జూనియర్ కళాశాలలో చేరి ఐఐటీ కి సన్నద్ధం అవుతున్నాడని తెలిసి నేను కూడా అలాగే చేరాలని కలలు కన్నాను. పదో తరగతి లో 600 కి 542 మార్కులు సంపాదించి మా పాఠశాలలో ప్రథముడిగా నిలిచాను.
బాగా మార్కులు సంపాదించినందువల్ల , గౌతమ్ జూనియర్ కళాశాల యాజమాన్యం నా కోసం ఫీజు మినహాయింపునిచ్చింది. ఇందుకు మా ప్రమోద్ సార్ కూడా సహాయం చేశారు. లేకపోతే సంవత్సరానికి యాభై వేల రూపాయలు మా తల్లిదండ్రులకి అసాధ్యమైన పని అయ్యేది.
రెసిడెన్షియల్ స్కూల్లో
రెసిడెన్షియల్ స్కూల్లో కి మారడం నాకు కొంచెం కొత్తగానే అనిపించింది. ఎందుకంటే అప్పటి దాకా స్కూలు, ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్ళింది లేదు. అక్కడ నాకు సహాయం చేయడానికి అక్క, అమ్మ, నాన్న ఉండేవాళ్ళు. బయటి సమాజంతో ఇంటరాక్ట్ అవడం అదే ప్రథమం. కొత్త జీవితానికి అలవాటు పడటానికి ఓ సంవత్సరం పట్టింది.
అక్కడ నాకు స్పూర్తి కె.కె.యస్ భాస్కర్ (ఈ కె.కె.యస్ భాస్కర్ అనే అబ్బాయి గురించి కూడా నేను పేపర్లో చదివాను. దాదాపు మా వయసు వాడే. ఇతన్నే ర్యాంకుల భాస్కర్ అనేవాళ్ళు. ఎందుకంటే ఈ అబ్బాయి ఎంసెట్లో మొదటి ర్యాంకు. ఏఐట్రిపుల్ ఈ లో మొదటి ర్యాంకు. ఐఐటీ లో కూడా మొదటి పది లోపలే ర్యాంకు. వాళ్ళది కూడా పేద బెస్తవారి కుటుంబమే. అప్పట్లో నేను అతని ప్రతిభ చూసి అబ్బురపడ్డాను.) అనే వ్యక్తి. అతను మమ్మల్ని ఉత్తేజపరచడానికి మా కళాశాలకు వచ్చేవాడు. గౌతమ్ జూనియర్ కాలేజీ గురించి, ఐఐటీ గురించి మా తల్లిదండ్రులకు ఏమీ తెలియదు కానీ నేనేది చేసినా అందులో తప్పక ప్రోత్సాహం అందించేవారు. ఒకవేళ విజయం సాధిస్తే నన్ను ఆకాశానికెత్తేసేవారు. ఒక వేళ వైఫల్యం ఎదురైతే అందువల్ల కలిగే లాభాల గురించి చెప్పేవారు. ఏ విధంగా నైనా నేను సంతోషంగా ఉండాలనేదే వారి అభిమతం. అలాంటి అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు.
ఐఐటీ మద్రాస్ లో
ఐఐటీ ప్రవేశ పరీక్షలో నా ర్యాంకు పెద్దగా లేకపోయినా (992) వికలాంగుల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచాను. ఐఐటీ మద్రాసు లో కంప్యూటర్ సైన్సులో చేరాను.
ఇక్కడ నా రోల్ మోడల్ కార్తీక్ అనే మా స్కూల్ సీనియర్. ఐఐటీ మద్రాస్ లో ఉన్నప్పుడు అతనే నాకు స్పూర్తి. నేను అక్కడికి వెళ్ళక ముందే అతను నా కోసం అటాచ్డ్ బాత్రూమ్ కలిగిన గది కోసం అడిగిపెట్టాడు. అలా నేనక్కడికి వెళ్ళేసరికే ఆ గది నాకు కేటాయించబడింది. అతను నాకు దిశా నిర్దేశం చేయడమే కాక ఎంతో సహాయం చేశాడు.
ఆ నాలుగు సంవత్సరాల్లో నేను ఓ వ్యక్తిగా, విద్యార్థిగా చాలా ఎదిగాను. అక్కడ చదవడం ఓ మరిచిపోలేని అనుభవం. నేను కలిసి చదువుకున్న వాళ్ళు మంచి ప్రతిభావంతులు. వాళ్ళతో కలిసి చదవడం నేను గర్వంగా చెప్పుకుంటాను. అస్సలు మా ల్యాబ్ లో పనిచేసే వాళ్ళతో మాట్లాడటం ద్వారా నేనెంతో నేర్చుకున్నాను.
ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళకంటే మంచి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు
మా ప్రొఫెసర్ పాండురంగన్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఆయన నన్ను మరో నలుగురితో కలిసి ఇంటర్న్షిప్ కోసమై బోస్టన్ నగరానికి పంపించారు. అది చాలా గొప్ప అనుభవం నాకు.
గూగుల్ లో కొలువు
మా తల్లిదండ్రులకు ఇంక అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో నేను పీహెచ్డీ లో చేరదలుచుకోలేదు. మొదట్లో మోర్గాన్ స్టాన్లీ అనే కంపెనీ నన్ను సెలెక్ట్ చేసుకున్నా నేను కంప్యూటర్ సైన్స్, అల్గారిథమ్స్, గేమ్ థియరీ మీద ఆసక్తితో గూగుల్ లో చేరడానికే ప్రాధాన్యత నిచ్చాను.
నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేనెందుకు అలా అంటున్నానో మీకు తెలుసా?
నేను అడక్కుండానే ముక్కు మొహం తెలియని ఎంతో మంది నాకు సాయం చేశారు. ఓ సారి బీటెక్ రెండో సంవత్సరం అయిపోయిన తర్వాత కాన్ఫరెన్స్ కోసం రైల్లో ప్రయాణిస్తున్నాను. నాకు సుందర్ అనే ఆయన పరిచయయ్యాడు. అప్పటి నుంచీ నా హాస్టల్ ఫీజు ఆయనే భరిస్తూ వచ్చాడు.
ఇక్కడ నేను జైపూర్ కాలు గురించి కూడా చెప్పాలి. నేను మూడో తరగతిలో ఉండగా జైపూర్ కాలు అమర్చారు. కానీ రెండేళ్ళ తర్వాత వాటిని వాడటం ఆపేశాను. నాకు పూర్తిగా కాళ్ళు తీసేయడం వల్ల వాటిని నా శరీరానికి కట్టుకోవడం ఇబ్బందిగా ఉండేది. పైగా ఆ కాళ్ళతో నడవడం చాలా నెమ్మదిగా ఉండేది. కూర్చోవడం కూడా సమస్య గానే ఉండేది. మూడు చక్రాల బండిలో వేగంగా వెళ్ళగలిగేవాడిని. దాన్నే ఎంచుకున్నాను. ఎందుకంటే నాకేదైనా వేగంగా చేయడం ఇష్టం.
ఆ ఆసుపత్రి గురించి ఇంకో గొప్ప విషయం ఏమిటంటే వాళ్ళు జైపూర్ కాలు అమర్చగానే వాళ్ళ బాధ్యత తీరిపోయిందనుకోరు. వాళ్ళకి జీవనాధారం కల్పించడం కోసం కూడా కృషి చేస్తారు. ఇంకా నాకేం సాయం కావాలో అడిగారు. అప్పట్లో నేను ఐఐటీ లో చేరగలిగితే నాకు ఆర్థిక సహాయం చేయండని చెప్పాను.కాబట్టి నేను ఐఐటీ మద్రాసు లో చేరినప్పటి నుంచి నా ఫీజు సంగతి వాళ్ళే చూసుకునే వారు. మా తల్లిదండ్రులకు కూడా నా చదువు భారం కాలేదు. దాంతో మా అక్కను సులభంగా నర్సింగ్ చదివించగలిగారు.
ఐఐటీ లో నాకో సర్ప్రైజ్
నా మొదటి సంవత్సరం తర్వాత ఇంటికెళ్ళి తిరిగొచ్చే లోపు ఐఐటీ లో నాకు తెలియకుండా రెండు సంఘటనలు జరిగాయి.
మా విభాగంలో నా కోసం ఓ లిఫ్ట్, ఒక అంతస్థు నుంచి మరో అంతస్థు కు ఎక్కడానికి మెట్లు కాకుండా ఏటవాలుగా ఉందే ర్యాంప్స్ ఏర్పాటు చేశామని ఒక ఉత్తరం వచ్చింది. అంతే కాదు కొంచెం ముందుగా వచ్చి అవి నాకు సౌకర్యంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోమని కూడా తెలియజేశారు.
ఇక రెండో సౌకర్యం ఏమిటంటే మా డీన్ ప్రొఫెసర్ ఇడిచాండీ, విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీ ప్రసాద్ విద్యుచ్చక్తితో నడిచే చక్రాల కుర్చీలు అమ్మే చోటుని కనిపెట్టారు. దాని ఖరీదు యాభై ఐదు వేలు. వాళ్ళు దాన్ని కొనకుండా మొత్తం డబ్బు నా చేతికే ఇచ్చి కొనుక్కోమన్నారు. ఎందుకంటే అలా తీసుకుంటే అది సంస్థకు కాకుండా నాకే చెందుతుందని.
నా జీవితం పూర్తిగా మారిపోయింది. నేను, స్వేచ్చగా, స్వతంత్రంగా ఫీలయ్యాను. అందుకనే నేను అదృష్టవంతుణ్ణి అని చెప్పాను. దేవుడు నా కోసం అన్నీ అమర్చి పెట్టాడు. ప్రతి అడుగులో నాకు సాయం చేస్తూనే ఉన్నాడు…
ఆంగ్ల మూలం: రెడిఫ్.కాం
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ఇద్దరు స్ఫూర్తి ప్రధాతలు
ఇటీవల ఆన్లైన్ లో కొన్ని కథనాలు చదువుతుంటే నాకు ఆసక్తి కలిగించిన ఇద్దరు స్పూర్తి ప్రధాతల గురించి రాద్దామనే ఈ టపా…
ఒకరేమో దుగ్గిరాల పూర్ణచంద్రారావు అలియాస్ చందూ. కేవలం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తో సంవత్సరానికి లక్ష డాలర్లు దాకా సంపాదించవచ్చని ఇతన్ని చూసిన తర్వాతే తెలిసింది. ఏదైనా దిగితే కానీ లోతు తెలియదంటారు. ఇంతకు ముందు ఎక్సెల్ ను చూసి “ఆ ఏముంది ఇందులో? టేబుల్స్ గట్రా చేస్తారు. అంతే కదా!” అనుకునే వాణ్ణి. కానీ ఇతన్ని గురించి చదివాక ఎక్సెల్ తో ఇంత సంపాదించచ్చా అని ఆశ్చర్యపోయాను. ఇతను ఎక్సెల్ లోతుపాతుల్ని చవిచూసి తన బ్లాగు ద్వారా చిట్కాలను ప్రపంచానికి అందజేస్తుంటాడు. అంతే కాకుండా తను నేర్చుకున్న చిట్కాలన్నింటినీ క్రోడీకరించి ఒక పుస్తకం కూడా రాశాడు. ఎక్సెల్ కు సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్లు తయారు చేసి కూడా అమ్ముతూ ఉంటాడు. ఒక విషయం గురించి బాగా పరిశోధన చేస్తే అందులోనే బోలెడన్ని అవకాశాలు సృష్టించుకోవచ్చని ఇతన్ని చూసి బాగా అర్థమయ్యింది నాకు. ఆంధ్రా యూనివర్సిటీ లో బ్యాచిలర్ డిగ్రీ, ఐఐఎమ్ ఇండోర్ నుంచి ఎంబీయే పూర్తి చేసిన ఇతను కొంతకాలం పాటు టీసీయెస్ లో కూడా పనిచేశాడు. తరువాత పూర్తి సమయాన్ని ఈ వ్యాపకం పై వెచ్చించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి తమ స్వంత ఊరైన విశాఖపట్టణం నుంచే తన కార్యకలాపాల్ని నిర్వహిస్తూ ఉంటాడు, భార్యతో సహా!. ఇంతకన్నా కావాల్సిందేముంది చెప్పండీ? ( అరుణపప్పు గారి బ్లాగు నుంచి…)
ఇక రెండో అబ్బాయి బీహారు కు చెందిన కౌశలేంద్ర. కూరగాయలకు బీహార్ ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది అతని లక్ష్యం. ఎంబీయే విద్యకు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఐఐఎం అహ్మదాబాదు లో 2007 సంవత్సరానికి ప్రథమ స్థానంలో నిలిచినవాడు. తన సహోధ్యాయిల్లాగా కోట్లు సంపాదించే కార్పొరేట్ ఉద్యోగాన్ని కోరుకోలేదు. బీహార్ అభ్యున్నతికి పాటుపడాలనుకున్నాడు. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన కౌశలేంద్ర ఎంబీయే పూర్తి చేసిన వెంటనే క్షేత్ర పరిశోధన కోసం విస్తృతంగా పర్యటించాడు. ఎందరో రైతుల్ని కలిసి వ్యవసాయంలో మెలకువల్ని శ్రద్ధగా ఆకళింపు చేసుకున్నాడు. తరువాత కౌసల్య ఫౌండేషన్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారా చేపట్టిన మొట్టమొదటి ప్రాజెక్టు ఏసీ బండ్ల ద్వారా కూరగాయలు అమ్మే విధానం. ఈ విధానం ద్వారా కూరగాయలు ఎక్కువకాలంపాటు పాడవకుండా ఉండి నష్టాన్ని నిలువరిస్తాయి. ప్రస్తుతం ప్రీపెయిడ్ కార్డుల ద్వారా కూరగాయల్ని కొనే వ్యవస్థను అభివృద్ధి పరిచే పనిలో ఉన్నాడు. కానీ ఈ ప్రయత్నంలో అతను ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కొంటున్నాడట. ఉదాహరణకు బ్యాంకులో జమ చేసిన చెక్కు మూడు నెలలకు కూడా జమ కాకపోవడం, ఏసీ బండ్ల కోసం ఋణాలు మంజూరు చేసినా డబ్బు సరిగా విడుదల చేయకపోవడం మొదలైనవి. విద్యావంతుడైన తన పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అని వాపోతున్నాడు. గంగానదీ పరీవాహక ప్రాంతంలోని సారవంతమైన నేలలో పండే కూరగాయల్ని సరైన విధంగా మార్కెటింగ్ చేసుకుంటే రాష్ట్రం మరింత వృద్ధి సాధించగలదన్నది అతని నమ్మకం. పండించిన రైతుకే నేరుగా లాభం చెందాలన్న ఉద్దేశ్యంతో అతను నేరుగా ఉత్పత్తిదారులతోనే లావాదేవీలు నడుపుతూ ఉంటాడు. తన వ్యవస్థను విస్తరించడానికి వ్యవసాయ శిక్షణా సంస్థ సహకారం కూడా తీసుకుని ముందుకు సాగిపోతున్నాడు. తొందర్లోనే అతని లక్ష్యాన్ని సాధించాలని మనందరం ఆశీర్వదిద్దాం. (సిలికాన్ఇండియా.కామ్ సౌజన్యంతో).
@@@@@@@@@@@@@@@@@@@@@@@@

Written by: William Kamkwamba and Bryan Mealer
ఒక స్నేహితురాలు తొలిసారి ఆఫ్లైన్ కలుసుకున్నందుకు గుర్తుగా ఈ పుస్తకం బహుకరించింది నాకు. అసలా పుస్తకం గురించి తనకీ తెలీదు, నాకూ తెలీదు. పుస్తకంవెనుక అట్టపై విషయం చదివి, నచ్చి, నాకు నచ్చుతుందని చేసిన ఎంపిక అది! ఎంత చక్కని ఎంపికో!!
ఈ పుస్తకం కథ: ఆఫ్రికా ఖండంలోని అతి పేద దేశాల్లో ఒకటైన మలావీలోని ఒక కుగ్రామంలోని పిల్లవాడు (William Kamkwamba) గాలిమర (విండ్ మిల్) తయారు చేసి, తమ ఇంటికి విద్యుత్ సౌకర్యం తీసుకు వచ్చిన -నిజజీవిత గాథ ఈ పుస్తకం కథావస్తువు. గాలి మరలతో విద్యుత్ ఇక్కడ విషయం కాదు. అది విలియం కనిపెట్టినదీ కాదు. ఇక్కడ విషయమల్లా ఏమిటంటే – అతను గాలిమర ఎలా తయారు చేశాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రయోగాలు చేశాడు, అతని నేపథ్యం ఏమిటి? అందులోంచి అతను ఎలా జ్ఞానం సంపాదించాడు? అన్నది. సొంత ఇంటి ప్రయోగం అయ్యాక, అతను ఊరుకోసం కూడా ఇలాంటి నిజజీవిత ప్రయోజనం ఉన్న ఉపకరణాలు రూపొందించాడు. ఇంతకీ, ఇతగాడి వయసిప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు!!
ముందు విలియం గురించి చెబుతాను: అతను ప్రస్తుతం ఆఫ్రికన్ లీడర్షిప్ అకాడెమీలో విద్యార్థి. మొదటిసారి అతను అంతర్జాతీయంగా వెలుగులోకి వచ్చినది 2007 టెడ్ టాక్స్ లో ఒక వక్త అయినప్పుడు. ఇది టాంజేనియాలో జరిగింది. ఈ పుస్తకంలో జరిగిన అంతా చాలా మటుకు, ఆ టెడ్ టాక్ కి ముందు కథ. ఇంత వరకూ చదివాక, ఆ, ఇందులో పెద్ద ప్రత్యేకత ఏముంది? ఇలాంటి ప్రొఫైల్స్ చాలామందికి ఉంటాయి…అని మీలో కొంతమందైనా అనుకుని ఉంటారు. కానీ, నూటికి రెండుశాతం మందికి మాత్రమే విద్యుత్ దొరికే మలావీలో, కరువు కోరల్లో చిక్కుకుని, హైస్కూల్ దాకా వచ్చాక చదువు మానేసి, తిండితిప్పలకి నానా ఇబ్బందులూ పడ్డ ఒక పిల్లవాడు – పబ్లిక్ లైబ్రరీలో ఫిజిక్స్ పుస్తకాలు చదువుతూ ఇన్ని విషయాలు తెలుసుకుని, ఊరికి ఉపయోగపడేంత పరిజ్ఞానం సంపాదించాడంటే – స్పూర్తివంతంగా లేదూ?
విలియం జీవితంగురించి ఒక పరిచయం అతని వెబ్సైట్ లోనే ఇక్కడ చూడండి.
ఇక పుస్తకం గురించి: ఈ పుస్తకం లో విలియం తన కథను బ్రియాన్ మీలర్ అన్న జర్నలిస్టు సహాయంతో మనందరికీ చెప్పాడు. ఇందులో అతని ఊరు, కుటుంబ నేపథ్యం, కరువు కాలం నాటి పరిస్థితులు, తను స్కూలు మానేశాక చదువుకోవడం, టెడ్ టాక్ కి వెళ్ళడం దాకా కథ ఉంది.
ఇక, నా అభిప్రాయంలో ఈ పుస్తకం అందరూ తప్పక చదువవలసిన పుస్తకం. అందులోనూ, మన గ్రామాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ, టీనేజీ స్కూలు-జూనియర్ కాలేజీ పిల్లలకి ఈ పుస్తకం చదవడం తప్పనిసరి చేయాలి అని నా అభిప్రాయం. అలాగే, ఈ దేశంలో వనరుల్లేవు… ఏం చేయాలన్నా ప్రోత్సాహం ఉండదు అని ఏడ్చే వాళ్ళకీ ఇది తప్పనిసరి పాఠ్యాంశం కావాలి.ఎందుకంటే –
* మలావీ పరిస్థితులతో పోలిస్తే, వనరుల్లేవు అని సిగ్గున్నవారెవరూ కంప్లైంట్ చేయకూడదు కనుక. ఇక్కడ వనరులున్నాయి అని కాదు నేనంటున్నది. ఇంతకంటే లేమిలో కూడా విలియం చేయగలిగినపుడు, మనకి ఉన్న పరిమితుల్లో మనవారు చేయలేరా? అని.
* స్కూలులో బోధనకి దూరమైన విలియం లైబ్రరీ నుండి పుస్తకం తెచ్చుకుని చదువుకుని, ఇంత చక్కగా తాను అనుకున్నది సాధించాడు అంటే – ఆ పాఠ్యపుస్తకాలు ఎంత అద్భుతంగా రాసారో కదా..అని ఒక పక్క అనిపిస్తుంది కానీ, మరో పక్క – ఆ లెక్కన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటి కథకి రావాల్సినంత ప్రచారం వస్తే, ఆ స్పూర్తితో మరికొందరు ప్రయత్నిస్తే – ఆయా దేశాలకి మంచే జరుగుతుంది కదా! అన్న ఆశ (ఇప్పుడందరూ స్కూళ్ళు మానేయాలని అంటున్నా అనుకోకండి! ఘనత వహించిన మన స్కూళ్ళలో పాఠాలు మనకి జీవితంలో ఎంత బాగా పనికొస్తున్నాయో అందరికీ తెలుస్తూనే ఉంది కదా! కనుక, పాపంశమించుగాక.)
* ఈ పుస్తకంలో విలియం సైకిల్ డైనమో, విద్యుత్ పనితీరు, రేడియో పని తీరు – ఇలాంటివన్నీ తాను ఎలా అర్థంచేస్కున్నానో – వివరంగా, ఒక్కోచోట బొమ్మలతో సహా, చెబుతాడు. ఆ భాగాలన్నీ డైరెక్టుగా చిన్న క్లాసుల పిల్లలకి పాఠ్యాంశాలుగా పెట్టేయొచ్చు అసలు. పెట్టకపోతే పోయారు కానీ, ఇది చదువుతున్న వాళ్ళు మాత్రంమీ పిల్లల చేత ఆ భాగాలు చదివించండి (అదే లెండి, మీకు పిల్లలుండి, వాళ్ళు హైస్కూలుకు వస్తూంటే!!)
* పెద్దలైనా, ఈ పుస్తకం చదివితే, ఉద్వేగాశ్చర్యానందాలకు లోనవడం ఖాయం. ఇంకా, నాబోటి వారైతే – ‘చీ! నేను ఉన్నానెందుకూ! అన్ని సౌకర్యాలూ సరిగానే ఉన్నా ఇప్పటిదాకా సైన్సు ను సైన్సు లాగా అర్థం చేస్కోలేకపోయా’ అని ఏడ్చినా ఏడుస్తారు.
నాకు మాత్రం ఈ పుస్తకం చదవడం – ఒక గొప్ప అనుభవం. రాసిన శైలి వల్ల కాదు – అది చాలా సాధారణంగా ఉంది. రాసిన వ్యక్తి చిన్నవాడైనా రగిలించిన గొప్ప స్ఫూర్తి వల్ల… రచనలో చాలావరకూ ఉన్న నిజాయితీ వల్ల. చాలావరకూ అని ఎందుకంటున్నా అంటే – ఒక్కోచోట, మరీ ఎక్కువగా చెప్పినందుకో ఏమో కానీ, కాస్త అతిశయం అనిపించింది. కానీ, బహుశా, అలా అనిపించడం నా నైజంలోని లోపం వల్ల కావొచ్చు. తరువాత్తరువాత ఈ ఉత్సాహం చప్పబడిపోతుందిలేవో! అంటారా – నిజమే..నాకు ఆల్రెడీచప్పబడిపోయింది. కానీ, మనం కాకుంటే, మన ద్వారా ఇది పరిచయమైన మరొకరు..పది మందిలో ఒకరిని ఈ పుస్తకం నిజంగా ఏదో చేసేందుకు పురికొల్పినా చాలదూ? అందునా, మనలాంటి దేశంలో! అతనికి కాలం కలిసొచ్చింది…లేదంటే, సరిగ్గా సమయానికి వాళ్ళెవరో వచ్చి అతని గురించి తెలుసుకోవడం ఏమిటి, అదే సమయానికి టెడ్ కు వెళ్ళగలిగే అవకాశం రావడం ఏమిటి? అంటారా – కాలం కలిసి రావొచ్చు, రాకపోవచ్చు – మన ప్రయత్నం మనం చేస్తే, ఫలితాల సంగతి ఫలితాలే చూసుకుంటాయి – అని ఏనాడో కృష్ణ పరమాత్మ చెప్పలేదూ?

ఇంకా నేను మిమ్మల్ని నమ్మించలేకపోతే, ఈ అబ్బాయి వెబ్సైటులో (ఇక్కడ) పుస్తకం గురించి, తన గురించి, తను ప్రస్తుతం చేస్తున్న పనుల గురించీ వివరంగా రాసారు. చదివి, స్పూర్తి పొందాక – ఫ్లిప్కార్టుకి వెళ్ళి ఈ పుస్తకం కొని చదవండి.