మంచిప్పల సూరయ్యా', 'మంచిప్పల సూరయ్యా', 'మంచిప్పల
సూరయ్యా'
దేవలోకంలో దేవుని కోర్టు హాలు ముందున్న ద్వారపాలకుడు కమ్ కోర్టు బంట్రోతు కంఠం మూడుకి ఆరుసార్లు మారుమోగింది.
'వచ్చె వచ్చె'
'ఇక్కడే ఉండి పలకవేమయ్యా'
'మూడు మార్లు పిలవడం రివాజు కదా. అయినా రెక్కలు విరిచి పట్టుకున్న ఈ రాక్షసభటులు వదిలితే కదా. మంచీ మర్యాదా లేదు'
'ఒకటికి వంద మాట్లాడుతున్నావు. ఏమా తలబిరుసుతనం?'
'ఎవరయ్యా ఎక్కువ మాట్లాడుతున్నది? ఒకటి సరిపోతే ఒకటే మాట్లాడతాను. వంద అవసరమైన చోట వంద మాట్లాడతాను. హలో, యిలా చూడు, సూరయ్యని తక్కువ అంచనా వేయొద్దు'
'అటులనా? నీ సంగతి ఇప్పుడే తేల్చెదము'
'ఏంటి తేల్చేది. ముందు నన్ను యిక్కడికి ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి'
'నిశ్శబ్దము నిశ్శబ్దము' హాలు ముందు వైపు నుంచి ఎవరో భటుడు హెచ్చరిక చేశాడు.
'ఎవరూ మాటలాడరాదు. స్వామివారు వేంచేయుచున్నారు'
పరివారమంతా లేచి నిలబడ్డారు.
హాలంతా ఒక్కసారిగా అద్భుతమైన వెలుగు పరుచుకుంది. దేదీప్యమానంగా వెలిగిపోతూ దేవుడు హాలులో ప్రవేశించి ఉన్నతాసనం పైకి చేరుకున్నాడు.
ఆయన కూర్చున్న తర్వాత మిగిలినవారు కూర్చున్నారు. దేవుడు సైగ చేయగా అంతసేపూ వాదిస్తున్న చిత్రగుప్తుడు గబగబా ముందుకు నడిచి దేవుడి పక్కగా నిలబడ్డాడు.
'ఈనాడు ఎందరు?'
'ఒక్కరే ప్రభూ'
'ఒక్కరేనా?'
'అవును ప్రభూ'
'ఆరంభింపుము'
పెద్ద శబ్దంతో భేరీ మోగింది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది.
'పాపిని ప్రవేశపెట్టుము'
అప్పటివరకు ఒక పక్కగా రెక్కలు విరిచి పట్టుకున్న నన్ను సభా మధ్యానికి ఈడ్చుకుపోయారు.
పక్కగా నిలుచున్నంత సేపు కొద్దిగా బాగానే ఉందిగాని ఇలా మధ్యకు తీసుకొచ్చి ప్రదర్శనగా నిలబెడితే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. పైగా ఇప్పుడు చిత్రగుప్తుడు పాపీ అని సంబోధిస్తున్నాడు.
ఇక్కడున్న వాళ్లందరూ పాపులు కారా?
దేవుడి సంగతి ఏమోగాని మిగిలిన వారి జాతకాలన్నీ మహాత్ముడు ఎన్టీఆర్ ఏదో సినిమాలో గడగడా చెప్పి అందర్నీ గడగడలాడించెయ్యలేదూ? అప్పుడే మర్చిపోయారా? చప్పున గుర్తు రావడం లేదుగాని లేకపోతే ఆ డైలాగులు మళ్లీ చెప్పి ఉందును కదా?
'ఏమిటి ఈతని నేరములు'
'మాట యిచ్చి తప్పడం స్వామి'
'ఇచ్చిన మాట తప్పుటయా?' అదేమంత తప్పు కాదన్నట్టుగా స్వామి స్వరం ధ్వనించింది.
'అవును ప్రభూ. ఇప్పటికి వందసార్లు అలా మాట యిచ్చి, ఒట్లు వేసి మరీ తప్పాడు ప్రభూ. అదీ మరెవరికో కాదు'
'ఎవరికి?'
'తమకే ప్రభూ. మీకు ప్రమాణం చేసి ఇచ్చిన మాటను తప్పాడు ప్రభూ'
'అదేమిటో వివరంగా చెప్పు'
'చిత్తం ప్రభూ! క్రీ.శ. 1930లో భూలోకంలోని దక్షిణ భారతదేశంలో, ఆంధ్రావని గుండెచప్పుడు, అదే హార్టుబీటైన హైదరాబాదులో'..
'చిత్రగుప్తా'
'అయ్యా'
'అంతొద్దు'
'పాయింటుకి వస్తున్నాను ప్రభూ. ఈ పాపి తనకి ఇరవై ఏళ్ల వయసప్పుడు అనగా 1950లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళుతూ తమకు తొలి ప్రమాణం చేశాడు ప్రభూ'
'ఏమని?'
'ఉద్యోగం వస్తే నడిచి తిరుమల వచ్చి తలనీలాలతో పాటు నిలువు దోపిడీ ఇస్తానని'
'ఇచ్చాడా'
'లేదు ప్రభూ'
- ఈ చిత్రగుప్తుడు టూమచ్గా ఉన్నాడే. ఎప్పుడో యాభై ఏళ్ల కిందటి మాట ఇప్పుడు తవ్వి తీసి చెప్పాలా? ఉద్యోగం వచ్చిన వెంటనే వెళ్లడానికి డబ్బులుండొద్దూ? నెల జీతం రాగానే వెళ్దామనుకున్నాను. నిలువు దోపిడీకి ఉత్త చేతులతో వెళ్లలేం కదా. ఆ తరువాత కొత్త ఉద్యోగం సెలవు యివ్వం అని అంటే వెళ్లలేదు.
'తరువాత?'
'ఈ పాపికి పెళ్లి కుదిరింది ప్రభూ. కొత్త భార్యను తీసుకొని కొండకొస్తానని రెండవసారి మొక్కినాడు ప్రభూ'
'అప్పుడూ రాలేదా'
'లేదు ప్రభూ'
- ఇదిగో చిత్రగుప్తా. జరిగింది జరిగినట్టు చెప్పవేం? హనీమూన్ అదీ ఏం వద్దు కొండమొక్కు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది, అక్కడికే టిక్కట్లిప్పించండి అని చెప్పనే చెప్పాడు మామకి. ఇదిగో అదిగో అన్నాడు. ఈలోగా వాళ్లమ్మగారు, ముసలామె బాల్చీ తన్నేసింది. ప్రోగ్రాం కేన్సిల్. అది చెప్పవేం?
'మొదటి కాన్పులో కొడుకు పుడితే తప్పక వస్తానని, ముచ్చటగా మూడవసారి మొక్కాడు ప్రభూ'
- అలా అన్యాయంగా మాట్లాడకు చిత్రగుప్తా. పుట్టగానే తీసుకెళ్లకపోయినా పుట్టు వెంట్రుకలు తీయించడానికి వాళ్ల తాతగారు తిరుపతి మొక్కు ఉందంటే వెళ్లి వచ్చాం కదా. అది చాలదా?
'అలా మొదలైన మొక్కుల పర్వం కొడుక్కి ఫలానా స్కూల్లో సీటు వస్తే అది చేస్తానని, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే యిది చేస్తానని, ఇల్లు కడితే ఒకసారి, భార్యకు జబ్బు చేసినప్పుడు మరోసారి, బండి మీద నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నప్పుడు యింకోసారి, సొంతంగా వ్యాపారం ప్రారంభించినప్పుడు, కొడుకుని అమెరికా పంపించినప్పుడు...'
ఊపిరి తీసుకోవడానికి ఆగాడు చిత్రగుప్తుడు.
- ఓరి వీడి అసాధ్యం కూల. ఎంత పక్కాగా లెక్క రాసుకుంటున్నాడు ఈ ముసలి చిత్రగుప్తుడు. ఇంత డేటా ఇంత పర్ఫెక్టుగా మెయింటెయిన్ చేస్తున్నాడంటే వీడి కంప్యూటర్లో చాలా మంచి సాఫ్ట్వేర్ ఉన్నట్టుంది. వెళ్లేప్పుడు అడిగి మరీ తీసుకెళ్లాలి. పెద్దాడు దాన్ని బాగా డెవలప్ చేసి తను డెవలప్ అయిపోతాడు.
'కూతురిని పెళ్లివారు చూడ్డానికి వచ్చినప్పుడు, ఆమెకి ఆ సంబంధం కుదిరినప్పుడు, చిన్నకొడుకు పెళ్లాం ఆస్తి పంపకంపై గొడవ పెట్టినప్పుడు'
వింటున్న దేవుడు అప్రయత్నంగా ఆవ
లించాడు.
'అలా ఇప్పటికి వంద మొక్కులు మొక్కి, ఏ ఒక్కటీ నెరవేర్చలేదు ప్రభూ' దేవుడి అనాసక్త అవస్థ చూసి ముగించేశాడు చిత్రగుప్తుడు.
'అంతేనా చిత్రగుప్తా' దేవుడి గొంతులో ఓస్ ఇంతేనా అన్నట్లనిపించి కేసు కొట్టేస్తాడేమోనని ఆనందం కలిగింది.
'తమకే కాక ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, తనతో లావాదేవీలు నిర్వహించిన ప్రతిఒక్కరితోనూ ఎన్నో సందర్భాలలో అది చేస్తానని ఇది చేస్తానని వాగ్దానం చేసి మాట తప్పినట్టుగా నా దగ్గర రుజువులు ఉన్నాయి ప్రభూ'
- ఈ చిత్రగుప్తుడు శిక్ష పడేదాకా వదిలేట్టు లేడు. ఇతణ్ణి ముందే మేనేజ్ చేసుకోవలసింది.
'సరి సరి. ఇతగాడు శిక్షార్హుడే అని మేము విశ్వసించుచున్నాము. ఇతనికి తగిన శిక్ష ఏమీ?'
'సలసల కాగుతున్న పామోలిన్ ఆయిల్లో ముంచి, మండుతున్న బొగ్గుల కుంపటిలో కాల్చి, సెయిల్ మేకులతో గుచ్చి, కుప్పం ఏనుగులతో తొక్కించి'..
'ప్రభూ' చిత్రగుప్తుడి లిస్ట్ పూర్తికాకముందే ఎలాగోలా గొంతు పెకలించుకుని అరిచాను.
'ఏమి?'
దేవుడు నావైపు చూడగానే నన్ను మాట్లాడనివ్వమని కళ్లతోనే వేడుకున్నాను.
'పలుకుము'
'ధర్మఫ్రభువులు. శిక్ష కరారు చేసే ముందు అవతలివారికి కూడా వారి వాదన వినిపించేందుకు అవకాశం యివ్వరా?'
'అవతలివారా, వారెవరు?'
'నేనే ప్రభూ'
'యివ్వను. నేరగానికి అవకాశం యివ్వడం అసంభవం. ప్రతి నేరగాడూ తను చేసే ప్రతి నేరానికీ తగిన కారణాలు ఉన్నాయనే అంటాడు. కారణాలు చెప్పుకుంటూ లోపాలను ఉపయోగించుకుంటూ నీతీ నిజాయితీ నిబద్ధతలకు మేలిముసుగులు కప్పుతూ భూలోకంలోలా ఇక్కడ మనగలగడం కుదరదు. మనుషులలో మానవీయతను నింపి, కట్టుబాట్లకు నిబద్ధులను చేసి, సామాజిక క్రమశిక్షణకు లోబడే విధంగా సత్సంప్రదాయపు జీవితం గడిపేలా చూడటం మా విధి. గాడి తప్పిన వాణ్ణి గాడ్ ఎలా క్షమిస్తాడురా మూర్ఖా? గాంధీని చంపిన గాడ్సే కూడా తను చేసిన ఘాతుకానికి పుంఖానుపుంఖాలుగా కారణాలు ఉన్నాయన్నాడు మీ భారతావనిలోనే ఒకనాడు. మేమది మర్చిపోలేదు'
'దేవా, మీరసలు దేవుడేనా? ఇక్కడున్న వారంతా దేవతలేనా?'
'స్వామీ. మీ స్పీచ్కి వీడికి మతి భ్రమించింది. తమ ఐడెంటిటీనే ప్రశ్నిస్తున్నాడు' చిత్రగుప్తుడు హోమగుండంలో నెయ్యి పోశాడు.
'ఏమా పిచ్చి ప్రేలాపన' దేవుని కంఠం గర్జిం చింది.
'మన్నించండి మహాప్రభూ. ఏదో తొందరలో అనేశాను. దేవ దేవ ధవళాచల మందిర, గంగాధరా హర నమో నమో'
'పాటొద్దు. పాయింటుకు రా' దేవుడి స్వరంలో తీవ్రత తగ్గింది.
'భగవాన్, రక్షకుడా, కరుణామయా'
'ఏమిటీ సినిమా టైటిల్సు. విషయం చెప్పవయ్యా'
'దేవా. కొండకు రాలేదని, గుండు చేయించలేదని, నిలువు దోపిడీలు యివ్వలేదని ఇంకా మొక్కులు తీర్చలేదని దేవుళ్లే లెక్కలు రాసి శిక్షలు వేస్తే ఇంక దేవుళ్లని దేవుళ్లనడం ఎందుకు స్వామీ. మేమిది ఇస్తే మీరది ఇస్తారని మీరు బోర్డు పెట్టి లోకాలను పాలిస్తున్నట్టు మేము నమ్మవచ్చు కదా. అప్పోసప్పో చేసేసి నీ మొక్కు తీర్చేస్తే మనిషి కోరుకున్నవన్నీ జరిగిపోవాలి కదా. మేము మొక్కులు చెల్లించలేదని మీరంటున్నారే మరి మీరు తీర్చని మొక్కుల సంగతి ఏమిటి? ఎన్ని మొక్కులు మొక్కినా ఒక్కటీ తీరలేదు అనే వాళ్ల పరిస్థితి ఏమిటి? అది మీ నేరం కాదా?'
'ప్రభువులతో ఏమిటీ లా పాయింట్లు? మొక్కు లు మొక్కుటయే మీ వంతు. వాటిని నెరవేర్చుటయా లేకుంటే రిజెక్ట్ చేయుటయా అనేది ప్రభువుల వంతు. మొక్కు నెరవేరినా లేకపోయినా మీరు మొక్కు తీర్చాల్సిందే. మాట ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్....'
'చిత్రగుప్తా. ఆపుము. ఇతను వ్యాపారి. ఇతనికి అర్థమయ్యే ఎకానమీ భాషలోనే చెప్తాను. సూరయ్యా. విను. డబ్బు, మనిషి, వ్యవస్థా.. వీటి నడుమ సంబంధం తెలుసుకో. మనిషి తనకు కావలసిన సౌకర్యాలను కల్పించడం కోసం వ్యవస్థను తయారు చేశాడు. వ్యవస్థ నడవడానికి డబ్బు కావాలి. డబ్బు మనిషి సంపాదించాలి. అందుకోసం పని చేయాలి. పని వ్యవస్థ కల్పించాలి. ఇదొక చక్రవ్యూహం. ఈ వ్యూహంలో మనిషి ఒక్కడికే బుర్ర ఉంది. ఆలోచించి ఆచరించే సమర్థత ఉంది. అతడు తన ధర్మం విస్మరించాడా వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. వ్యవస్థ ముక్కలైందా? డబ్బు గల్లంతవుతుంది. అందువల్ల మనిషికి క్రమశిక్షణ ముఖ్యం. దానిని పెంపొందించేదే దైవచింతన. దైవత్వం అంటే కర్తవ్య పాలన. మనిషి ఈ కర్తవ్య పాలనను మాట తప్పకుండా క్రమశిక్షణతో చెయ్యడమే మనిషి, డబ్బు, వ్యవస్థ పని చేయడానికి మూలకారణం. దేవుడు ఇదంతా గమనిస్తుంటాడు. మనిషి ఈ నియంత్రణలో ఉండేలా చేస్తాడు. అలాగే మొక్కుల రూపంలో మీరు యిచ్చింది మళ్లీ మీకే ఇస్తూ సర్క్యులేషన్ చేస్తుంటాడు.'
'మహాప్రభో.. ఇక ఆపండి. అజ్ఞానం అంధకారంలా కమ్ముకొచ్చి నా కర్తవ్యాన్ని అలక్ష్యం చేశాను. ఒక్క ఛాన్సు యివ్వండి. భూలోకానికి వెళ్లి నా వాగ్దానాలు, యిచ్చిన మాటలు, చేసిన మొక్కులు తీర్చుకొని వస్తాను.'
'వద్దు ప్రభూ వద్దు. ఇలాగే కొందరిని గతంలో మీరు మన్నించి ఒక్క ఛాన్సు యిచ్చి భూలోకానికి పంపారు. వాళ్లంతా రాజకీయ నాయకులై మిమ్మల్ని, ప్రజల్ని నిలువునా ముంచారు. మళ్లీ అటువంటి నిర్ణయం తీసుకోకండి స్వామీ' చిత్రగుప్తుడు వాదిం చాడు.
దేవుడు ఒకసారి చుట్టూ పరికించి చూశాడు.
'తర్జనభర్జనలతో శిరోభారం కలిగినది. శిక్ష కరారు చేయ ఏకాగ్రత కుదురుట లేదు. అట్లని క్షమించి విడిచిపెట్టుట న్యాయసమ్మతంగా తోచుట లేదు. కనుక కేసును తిరిగి జాగ్రత్తగా ప్రవేశపెట్టవలసిందిగా ఆదేశించుచున్నాను'
దేవుడు లేచి వెళ్లిపోయాడు.
వెలుగూ ఆయనతో పాటే వెళ్లిపోయింది.
'అంటే వెళ్లిపోవచ్చా?'అడిగాను.
'మళ్లీ పిలుస్తారులే' అన్నాడు చిత్రగుప్తుడు.
ఆనందంతో ఎగిరి గంతేసి ఒక్కసారిగా కిందకు దూకాను.
***
వెనక్కి వచ్చిన నాకు యిల్లంతా ఏదో తేడాగా బోసిపోయినట్టుగా అనిపించింది. లోపలికి చూశాను.
హాల్లో నా ఫోటో. ఫోటో ముందు దీపం.
'నిద్రలోనే పోయాడు నా బిడ్డ.. రోజూ పొద్దున్నే లేచి అందర్నీ లేపేవాడు. ఇవ్వాళ ఎవరు లేపినా లేవలేదు. చిన్నాడు డాక్టరు కదా, వెంటనే పిలిపిస్తే వచ్చి చూశాడు, అప్పటికే నాడి కొట్టుకోవడం ఆగిపోయిం దట' ఏడుస్తూ ముక్కు చీదడానికి ఆపింది తల్లి.
'అందరూ ఏటి ఒడ్డుకు వెళ్లారమ్మా. పెద్దాడికి ఫోన్ చేస్తే పదోనాటికి వస్తానన్నాడు. కూతురూ అల్లుడూ చిన్నరోజుకి వస్తామన్నారు. దూరాభారం కదా, ఇంకా ఉంచడమెందుకులే అని అన్నీ చిన్నాడి చేతనే కానిచ్చేశాము. అలా కూర్చోండి. అయ్యో నా బిడ్డా'... మళ్లీ శోకాలు మొదలెట్టింది.
చిత్రగుప్తుడి తెలివి అర్థమైంది.
సోల్ ఉంది, బాడీ లేదు.
ఇది కండిషనల్ బెయిల్. మళ్లీ వెంటనే వెళ్లిపోక తప్పదు.
చేసిన తప్పులు సవరించుకుని, యిచ్చిన మాటలు నెరవేర్చుకోవడానికి నాకు యింకో ఛాన్స్ లేదు. యివ్వలేదు.
హతోస్మి.
బయట ఎవడో పాట వేశాడు.
'మానవా ఏమున్నది ఈ దేహం, ఇది రక్తమాంసముల అస్థిపంజరం దీనిపై ఎందుకురా వ్యామోహం'
దండ వేసున్న ఫోటో వైపే చూస్తూ ఉండిపోయాను ఆత్మరూపంలో ఆత్మపరిశీలన చేసుకుంటూ.
నాస్తిక భర్త
జె.యు.బి.వి.ప్రసాద్
అత్తా, కోడళ్ల నోముల ప్రహసనం మోహన్కి బాగా తెలుసు. ఏవో వాళ్ల నమ్మకాలు వాళ్లవి అని వదిలేశాడే గానీ, ఆ పూజలూ గట్రా నచ్చేవి కావు. ఆ నోముల వల్ల మోహన్కి వచ్చిన కొత్త కష్టం ఒకటుంది.
'మా ఆయన నాస్తికుడు తెలుసా? దేవుడి మీద నమ్మకం లేదాయనకు' అతిశయంగా నవ్వుతూ అంది సునంద తన స్నేహితురాలు లక్ష్మితో.
'అవునా?' అంది లక్ష్మి ఓరకంట మోహన్ వైపు చూస్తూ, కొంచెం నొసలు చిట్లిస్తూ.
ఏమనాలో తెలియక భావరహితంగా చూశాడు మోహన్. నాస్తికత్వం కూడా ఒక క్వాలిఫికేషన్ లాంటిదని అతనికి తెలియదు. సునందకూ, మోహన్కూ పెళ్లయి నెల రోజులయింది. విజయవాడలో చుట్టాలింట్లో పెళ్లి ఉందని హైదరాబాద్ నుంచి రైల్లో వెళుతున్నారు. లక్ష్మి సెండాఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చింది.
ఇంతలో గార్డ్ విజిల్ వూదడమూ, రైలు కదలడమూ జరిగాయి.
జీవిత భాగస్వామిని వెతుక్కోవడం చేతగాక, ఆ విషయం మోహన్ తల్లిదండ్రులకే వదిలేశాడు. 'నా కాబోయే భార్య నాలాగే నాస్తికురాలయి ఉండాలి' అని ఒకే ఒక షరతు పెట్టాడు, తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నప్పుడు.
ఊహ తెలిసినప్పటి నుంచీ, పద్దెనిమిదేళ్ల వరకూ మంచి భక్తుడిగానే పెరిగాడు. ఆ తరవాత పుస్తకాలు చదవడం నేర్చుకుని, అరకొర నాస్తికుడిగా తయారయ్యాడు. నాస్తికత్వం పూర్తిగా అర్థం గాకపోయినా, దేవుడి మీద నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకున్నాడు ముందుగా.
'సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆడపిల్లలెవరూ నీలా నాస్తికుల్లా ఉండరు. పిచ్చి పుస్తకాలు చదివి నువ్విలా పాడయిపోయావు. ఇలాంటి వెర్రి, మొర్రి షరతులు పెడితే నీకు పిల్లనెవరూ ఇవ్వరు, తెలుసా!' అంటూ తల్లి భయపెట్టింది.
దానికి వంత పాడారు అక్కా బావలు.
పెళ్లి కాకుండా జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందేమోనన్న భయంతోనూ, దేవుడిని నమ్మే ఆడపిల్లలు కూడా మంచితనంతో ఉంటారనే నమ్మకంతోనూ తన షరతుని వదులుకున్నాడు చివరికి.
పెళ్లి చూపుల్లో తను సునందతో ఒంటరిగా మాట్లాడాలంటే, పెద్ద వాళ్లు కాస్త ఏకాంతం కల్పించారు.
'నాకు దేవుడి మీద నమ్మకం లేదండీ! నేను నాస్తికుడిని. మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మీకీ విషయం ముందే తెలియాలని చెప్తున్నాను' అన్నాడు మోహన్.
అతని నిజాయితీకి సునంద ముచ్చటపడిపోయింది.
'మీ ఫ్రాంక్నెస్ నాకు చాలా నచ్చింది. ఇంతమంది మనుషులు దేవుడున్నాడని నమ్ముతున్నారు కాబట్టి దేవుడున్నాడనే నా విశ్వాసం. మీరు నమ్మకపోయినా నాకు అభ్యంతరం లేదు!' నవ్వుతూ చెప్పింది.
అంతే! ఆ నాస్తికుడికీ, ఆ ఆస్తికురాలికీ పెళ్లయిపోయింది. సాంప్రదాయబద్ధంగా కాకుండా, సింపుల్గా రిజిస్టర్ మేరేజీ చేసుకోవాలన్నది మోహన్ కోరిక. దానికి ఇరువైపుల వారే కాకుండా, సునంద కూడా ఒప్పుకోలేదు. పట్టుచీరలు కట్టుకుని, నగలు పెట్టుకోవాలన్నది ఆ అమ్మాయి సరదా.
గత్యంతరం లేక అందరిష్ట ప్రకారం శాస్త్రోక్తంగా సునంద మెళ్లో తాళి కట్టాడు.
'ఎప్పుడూ ఈ మంగళసూత్రం మెళ్లోనే వేసుకుంటావా, లేక అప్పుడప్పుడూ తీసేస్తావా?' కుతూహలంగా అడిగాడు పెళ్లయిన మర్నాడు.
'అమ్మో, ఇంకా నయం. నేను బతికున్నంత కాలమూ ఈ మంగళ సూత్రం నా మెళ్లోనే ఉంటుంది' అంది భక్తిగా మంగళసూత్రాన్ని కళ్లకద్దుకుంటూ.
అలా అని చెప్పి 'పతివ్రత'లా మోహన్ని నెత్తి మీద పెట్టుకున్నదీ లేదు. కాస్త ఎక్కువ, తక్కువలొస్తే చాలు ఉతికేసేది మాటల్తో మోహన్ని.
'ఆ మెళ్లో మంగళసూత్రం మీదున్న భక్తి, అది కట్టిన నా మీద లేకుండా పోయింద'ని వాపోయాడు మోహన్.
చుట్టాలింట్లో పెళ్లయ్యాక అడిగింది సునంద.
'ఏమండీ! సాయంకాలం నన్ను కనకదుర్గ గుడికి తీసుకెళ్లండీ!'
గతుక్కుమన్నాడు మోహన్.
నాకు దైవ నమ్మకాలు లేవని నీకు తెలుసు కదా. నన్ను గుడికి రమ్మంటావేమిటీ?
'ఒకసారి గుడికి వస్తే ఆస్తికుడిగా మారిపోతారని మీకేమన్నా భయమా? మనూళ్లో అయితే అడిగే దాన్ని కాదు కదా! కొత్త ఊరు కాబట్టి మీ మీద ఆధారపడుతున్నాను. ఒక్కసారి నాతో గుడికి వస్తే మీకేమీ వ్రత భంగం కలగదులెండి!' కొంచెం బతిమాలుతున్నట్లుగా అంది.
సునంద లాజిక్కి జవాబేం చెప్పాలో తెలియలేదు మోహన్కి. అయిష్టంగానే బయలుదేరాడు గుడికి. మోహన్కి ఇంకో కోరిక ఉండేది, పెళ్లికి ముందర. అందువల్ల పెళ్లి చూపుల్లో సునందని, 'ఏమండీ, మీరు పెళ్లయ్యాక కూడా నన్ను 'ఏమండీ' అనే పిలుస్తారా, లేక పేరు పెట్టి పిలుస్తారా?' ఆశగా అడిగాడు.పేరు పెట్టి పిలిపించుకోవాలని మోహన్కి తపన.
ఓ వెర్రి వెధవని చూసినట్లు చూసింది సునంద.
జనరల్గా అంతే కదండీ! మా అక్కలంతా వాళ్ల భర్తలని 'ఏమండీ' అనే పిలుస్తారు. మా అమ్మా అంతే! జనరల్గా నేనూ అంతే.
ఉసూరుమనిపించింది మోహన్కి. ఆ కోర్కెకి కూడా నీళ్లొదిలేసుకున్నాడు. కానీ పెళ్లయ్యాక, ఒంటరిగా ఉన్నప్పుడు 'నువ్వు' అనీ, ఎవరైనా ఉన్నప్పుడు 'ఏమండీ' అని సంబోధించేది సునంద మోహన్ని. అది నచ్చక, 'ఆ రెండు పిలుపుల్లో ఏదో ఒకటి సెటిల్ చేసుకో! ఇలా రెండు రకాలుగా పిలవడం నాకు నచ్చదు' అని చెప్పాడు.
'ఏంటీ? నలుగురిలో 'నువ్వు' అని పిలవడమా? మీ అమ్మగారు చంపెయ్యరూ నన్ను?' అంటూ నెపాన్ని అత్తగారి మీదకి నెట్టేసి 'ఏమండీ' అనే పిలుపుతో సెటిల్ అయిపోయింది సునంద. దానికే అలవాటు పడిపోయాడు మోహన్ కూడా.
గుళ్లో సునంద పక్కనే నించున్నాడు చుట్టూ చూస్తూ.
కాస్త దణ్ణం పెట్టుకోండి అని గొణుగుతూ మోచేత్తో పొడిచింది సునంద.
దణ్ణం పెట్టుకోకుండా, సీరియస్గా చూసి, గుడి బయటకి వచ్చేశాడు. రుసరుసలాడుతూ వెనకే వచ్చింది సునంద. ఏదో అనబోయి సీరియస్గా ఉన్న భర్త మొహం చూసి, కాస్త జంకి ఊరుకుంది.
మర్నాడు ఇద్దరూ కలిసి హైదరాబాద్ వచ్చేశారు. రోజులు మామూలుగానే ఎగుడు, దిగుడు దారిలో పోతున్నాయి. ఆ రోజు మోహన్ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి, ముందు గదిలో సునందా, అతని తల్లీ విచారంగా కూర్చుని కనిపించారు. ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని భయపడ్డాడు.
ఏవయిందీ? ఎందుకు మీరిద్దరూ దిగులుగా కూర్చున్నారూ? బెతుగ్గానే అడిగాడు మోహన్.
ఇప్పుడో సమస్య వచ్చిందండీ, విచారంగా అంది సునంద.
ఏమిటా సస్పెన్సూ, అసలు విషయం చెప్పండి... విసుక్కున్నాడు.
అది కాదురా! ఇది శ్రావణ మాసం. మీ పెళ్లయ్యాక వచ్చిన మొట్టమొదటి శ్రావణ మాసం. సునంద నోములు నోస్తోందని నీకు తెలుసు కదా... అని చెప్పి కాస్త ఆగింది తల్లి.
అత్తా, కోడళ్ల నోముల ప్రహసనం మోహన్కి బాగా తెలుసు. ఏవో వాళ్ల నమ్మకాలు వాళ్లవి అని వదిలేశాడే గానీ, ఆ పూజలూ గట్రా నచ్చేవి కావు. ఆ నోముల వల్ల మోహన్కి వచ్చిన కొత్త కష్టం ఒకటుంది.
మొదటి నోము నోచుకున్నపుడు అమ్మవారి పూజ అవగానే, మోహన్ చేతిలో అక్షింతలు పెట్టి, అతను తెల్లబోయ చూస్తుండగా, వంగి అతని పాదాలకు దణ్ణం పెట్టబోయింది సునంద.
పాము తగలబోతున్నట్లుగా ఒక్క గంతు వెనక్కేశాడు మోహన్.
'ఇదేమిటీ, ఇదేమిటీ? ఇలాంటివి నాకిష్టం లేదు' అన్నాడు గబ గబా.
'నోము నోచాక, భర్త కాళ్లకి దణ్ణం పెట్టకపోతే అరిష్టం. అత్తయ్యగారూ చూడండీ, మీ అబ్బాయి దణ్ణం పెట్టనివ్వడం లేదు నన్ను...' అంటూ కంప్లయింటు చేసింది.
తల్లి వచ్చి మోహన్ని గట్టిగా పట్టుకోవడం, సునంద వెంటనే మోహన్ కాళ్లకి దణ్ణం పెట్టేయడం, మోహన్ బిత్తరపోయి చూస్తూ ఉండటం జరిగిపోయాయి.
అక్షింతలు వెయ్యలేదండీ, గొణిగింది సునంద.
ఫర్వాలేదులే, దణ్ణం పెట్టావుగా! వీడొక మొండి వెధవ అంటూ అత్తగారు లోపలికి వెళ్లిపోయింది.
తర్వాత వారం, సునంద పూజలో ఉండగానే మోహన్ ఇంట్లోంచి పారిపోయాడు, మళ్లీ ఎక్కడ సునంద చేత దణ్ణం పెట్టించుకోవాల్సి వస్తుందోనని.
సాయంత్రం ఇంటికొచ్చేసరికి గుమ్మంలోనే కన్నీళ్లతో ఎదురయ్యింది సునంద.
నీకంత బుద్ధి లేదేమిట్రా? భర్తకి దణ్ణం పెడితే గానీ నోము అయినట్లు కాదని అమ్మాయి కిందటి వారమే చెప్పింది కదరా! పొద్దున్నించీ ఏమీ తినకుండా, నీ కోసం చూస్తూ కూర్చుంది. నీకు దణ్ణం పెట్టి, నోము పూర్తయితేనే ఎంగిలి పడుతుంది. నీకంత మంకు పట్టుదల ఎందుకూ?... చీవాట్లేసింది తల్లి.
అవాక్కయిపోయిన మోహన్ కాళ్లకి చప్పున దణ్ణం పెట్టేసి వంటిం ట్లోకి వెళ్లిపోయింది సునంద. అప్పటినుంచీ గొడవ చెయ్యకుండా, లొంగి దణ్ణాలు పెట్టించుకుంటూ వచ్చాడు మోహన్.
ఇప్పుడు మీ నోములకేం కష్టం వచ్చింది? కాస్త కినుకగానే అడిగాడు.
అతని కినుకని పట్టించుకోలేదు అత్తా, కోడళ్లిద్దరూ.
'అది కాదండీ. అత్తయ్యగారికి అర్జెంటుగా వూరు వెళ్లే సందర్భం వచ్చింది. నోము రోజు సాయంకాలంగానీ తిరిగి రాలేరు. అసలే ఇది ఆఖరి వారం, చాలా ముఖ్యం కూడా! నా చేత నోము ఎవరు నోయిస్తారూ? అదీ అసలు సమస్య' చాలా దిగులుగా చెప్పింది సునంద.
'నీ అంతట నువ్వు నోము నోచుకోలేవా?' అడిగాడు. మోహన్కి అప్పటికే నోము మీద సహనం ఏర్పడిపోయింది.
'ఒక్క మనిషీ అంత పని ఎలా చేసుకుని పూజ చేసుకోగలదురా పొద్దున్నే? కాస్త మనిషి తోడు వుండొద్దూ?' అంది తల్లి కోడలికి సపోర్టుగా.
అర్థం కానట్టు చూశాడు మోహన్.
'మీరు కొంచెం సాయం చేస్తే, ఈ వారం గట్టెక్కించేస్తానండీ' బతిమాలుతూ అంది సునంద.
తెల్లబోయాడు మోహన్.
'నేనేం చెయ్యగలనూ?' ఆశ్చర్యంగా అడిగాడు.
'ఆ రోజు పొద్దున్నే లేచి, స్నానం చేసి, కొంచెం అమ్మవారికి వంట చేసి పెట్టాలి. ఆ లోపల నేను అమ్మవారిని తయారు చేసి, పూజ చేస్తాను. ఈ ఒక్కసారికీ సాయం చెయ్యండీ. ఇంకెప్పుడూ అడగనుగా మిమ్మల్ని' ఎంతో ప్రాధేయపడుతూ అంది సునంద.
తల్లి కూడా జాలిగా చూసింది కొడుకు వేపు. అంతే. మోహన్ మనసు ద్రవించిపోయింది.
నోము రోజు పొద్దున్నే నాలుగ్గంటలకి అలారం మోతతో లేచాడు. కళ్లు మండుతూండగానే స్నానం గట్రా కానిచ్చాడు. సునంద కూడా లేచి వంటగదిలోకి వచ్చి, పూజా మందిరం దగ్గర కూర్చుంది. మందిరాన్ని, దేవుడి పటాలను, విగ్రహా లనూ శుభ్రం చెయ్యడం, పూజ సామాగ్రి సమకూర్చడం మొదలుపెట్టింది.
'సతీవ్రతుడి'లాగా మోహన్ మామిడికాయ పప్పూ, వంకాయ కూరా, దోసకాయ పచ్చడీ, పులుసూ, అన్నం వండాడు. పులిహోర చేశాడు. పూర్ణం బూరెలూ, గారెలూ వండాడు. రుబ్బడాల్లోనూ, కూరలు తరగడంలోనూ, గిన్నెలు తొలవడం లోనూ సాయం చేసింది సునంద. మొత్తానికి వంట పూర్తయ్యేసరికి ఒళ్లు హూనం అయిపోయింది మోహన్కి. అప్పటికి పూజ మొదలుపెట్టింది సునంద.
మామూలు తెలుగయితే వచ్చు గాని సంస్కృత పదాలు నోరు తిరగడం లేదు సునందకి. పూజ మంత్రాలన్నీ సంస్కృతంలో వున్నవాయే! అన్ని రోజులూ అత్తగారు చిన్నప్పటి నించీ వున్న అభ్యాసంతో చదివిపెట్టేది. ఇప్పుడు తనే కూడబలుక్కుంటూ చదివితే ఆ సంస్కృత పదాలు తనకే కర్ణకఠోరంగా వినిపిం చాయి. చదవడం ఆపి మోహన్ వేపు బాధగా చూసిం ది. మోహన్కి విషయం అర్థం అయింది. కాలేజీలో అతడు సంస్కృతం నేర్చుకుని ఉన్నాడు. అప్పటికే ఆ అక్షర దోషాలు వినలేక అవస్థపడుతున్నాడు.
ఇంకోసారి అడిగించుకోకుండా మంత్రాలన్నీ చదివి పూజ జరిపించాడు సునంద చేత. పూజ పూర్తి చేసి అమ్మవారికి మహా నైవేద్యం ఘనంగా పెట్టి సంతృప్తి చెందింది సునంద.
సాయంత్రానికి వచ్చిన తల్లి కొడుకుని బాగా మెచ్చుకుంది. సునంద కూడా బోలెడంత కృతజ్ఞత చూపింది. ఓ రెండ్రోజులు మోహన్ని రాజకుమారుడిలాగా చూసుకుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని కాస్త సంతృప్తి పడ్డాడు మోహన్ కూడా.
ఆ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి, ముందు గదిలో సునంద తన స్నేహితురాలు లక్ష్మితో మాట్లాడుతూ కనబడింది. లక్ష్మి వేపు పలకరింపుగా చూసి లోపల గదిలోకి వెళ్లాడు మోహన్. అక్కడకి వీళ్లు మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. మోహన్ వినాలని సునంద కొంచెం గొంతు పెద్దది చేసింది కూడా.
'నువ్వెన్నైనా చెప్పు లక్ష్మీ. ఈ నాస్తికులు మంచివాళ్లు. వాళ్లు మనల్ని మారమనరు. వాళ్లే మారతారు. మనకి అనుగుణంగా మారి, అన్నిట్లోనూ తోడుగా వుంటారు. మనమేం మారక్కలేదు. ఏ సాయమూ చేయని ఆస్తిక మొగుడి కన్నా అన్ని సాయాలూ చేసే నాస్తిక మొగుడే బెటర్' అంది సునంద.
ఆ మాటలు మోహన్కి ఆనందం కలిగిస్తాయని సునంద విశ్వాసం. అయితే అవే మాటలు మోహన్ని ఆలోచనల్లో పడేశాయి.
అలా స్నేహితురాలితో అనడంలో సునందకి వేరే ఉద్దేశం కూడా ఉంది. పెళ్లయినప్పటి నించీ భర్త తననెక్కడ మారమంటాడోనని సునం దకి గుబులుగానే ఉంది. ఈ విధంగా మాట్లాడితే తనకా యిబ్బంది ఉండదని ఒక ఆశ.
పెళ్లయిన మొదట్లో సునందని కొంచెం మార్చడానికి ప్రయత్నించాడు మోహన్. కొన్ని వ్యాసాలున్న పుస్తకాలిచ్చాడు చదవమని. కథల పుస్తకాలు, ముఖ్యంగా చెడ్డ మొగుళ్లు మంచి భార్యలని కష్టపెట్టే కథలున్న పుస్తకాలు చదివేది ఇష్టంగానే. అవి చదివేటప్పుడూ, చదివిన తరువాతా ఆ చెడ్డ మొగుళ్లని తిట్టి పోసేది బహిరంగంగా. ఆ తిట్లు ఆ పుస్తకాల్లోని పాత్రలకో, లేక జాగ్రత్తగా వుండమని ఇండైరెక్టుగా తనకో అర్థం అయ్యేది కాదు మోహన్కి. వారపత్రికల్లో సినిమా కబుర్లూ, కథలూ చదివేదిగానీ వ్యాసాలు చదివేది కాదు.
ఒకరోజు సాయంకాలం ఏదో పార్కుకి వెళ్లారు ఇద్దరూ. నెమ్మదిగా నాస్తిక ప్రస్తావన తీసుకువచ్చాడు మోహన్. పాత పాఠమే మళ్లీ ఒప్పచెప్పింది సునంద.
'ప్రపంచంలో ఎంతోమంది దేవుడున్నాడంటూ నమ్ముతున్నారు కదా. ఉండకుండా ఎందుకుంటాడు దేవుడు?' ప్రశ్నించింది సునంద.
'ప్రపంచంలో ఎంతోమంది భూమి గుండ్రంగా లేదని నమ్మేవారు మొదట్లో. ఏ విషయంలోనన్నా నిజం ఆ విషయం మీద ఆధారపడి వుంటుందిగానీ ఎంతమంది నమ్ముతున్నారని కాదుగదా' తర్కం చెప్పాడు మోహన్.
ఆ తర్కం అర్థమే కాలేదు సునందకు.
'మీరెన్ని చెప్పండి. నేను దేవుడిని నమ్మే తీరుతాను. మీరు నా నమ్మకాన్ని మార్చలేరు' అంది సునంద స్పష్టంగా.
ఏమీ మాట్లాడలేదు మోహన్. ఆ అమ్మాయిని 'మారూ మారూ' అని అనడానికి తనకేం హక్కు ఉందీ అని తర్కించుకున్నాడు. ఏ వ్యక్తయినా విజ్ఞానం సంపాదించుకుని దానితో మారాలే గానీ ఇంకో వ్యక్తి ప్రోద్బలంతో కాదు కదా.
స్నేహితురాలు లక్ష్మి వెళ్లిపోగానే లోపల గదిలోకి వచ్చింది సునంద.
'మీరు స్నానం చేసి వస్తారా, నేను అన్నాలు పెట్టేస్తానూ?' అడిగింది.
'అలాగే కానీ, నీకో విషయం చెప్పాలి' మెల్లిగా అన్నాడు మోహన్.
ఏమిటన్నట్టు చూసింది సునంద.
'రేపు టౌన్హాల్లో రామాయణ విషవృక్షం మీద మీటింగు ఉంది. ఆ పుస్తకం రాసిన రచయిత్రితో ముఖాముఖీ కూడా ఉంది ఆ సభలో. వెళదామనుకుంటున్నాను' చెప్పాడు.
గతుక్కుమంది సునంద.
'వెళదామనుకుంటున్నానంటే మీరొక్కరేనా, నేను కూడా రావాలా?'
'నేను వెళ్లడం ఖాయం. నువ్వు కూడా రాకూడదూ, బాగుంటుందీ? ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు కూడా' ఆశగా అడిగాడు.
'ఇంకా నయం. దేవుడి మీద యింత నమ్మకాన్ని పెట్టుకున్న నేను విషవృక్షం మీటింగుకి రావడం ఏమిటీ? నా కళ్లు పోవూ? అసలు మీరు కూడా వెళ్లడం ఎందుకూ? ఏవో ఆ పుస్తకాలు యింట్లో చదువుతూనే వున్నారుగా' గట్టిగా అడిగింది.
'అదేమిటీ, అలాగంటావూ? నాకు నమ్మకం లేకపోయినా నీ కోసం నేనెన్నిసార్లు దైవ కార్యాల్లో తలదూర్చలేదూ? నమ్మకం లేకపోయినా నువ్వూ నా కోసం రావొచ్చు కదా.'
'అదీ యిదీ ఒకటెలా అవుతుందీ? నమ్మకం లేకుండా చేసినా, అవి దైవ కార్యాలవడం చేత మీకు పుణ్యమే వస్తుంది. నమ్మకం పెట్టుకుని, నేను ఈ నాస్తిక సభలకి వస్తే నాకు పాపం వస్తుంది. అదీ తేడా.'
'ఈ పాపం, పుణ్యం నిర్వచనాలు నీకు గానీ నాకు కావు గదా. కాబట్టి నువ్వు అనుకున్నట్టు నేననుకోనుగదా.'
'మీరెలా అనుకున్నా సరే, ఈ నాస్తిక సభలకి రావడం నా వల్ల కాదు బాబూ. అంతగా కావలిస్తే, మీరొక్కరూ వెళ్లి రండి' స్థిరంగా చెప్పింది.
'నేను ఎలాగూ వెళ్లి తీరతాను. దాన్ని ఎవరూ ఆపలేరు. నా సమస్య అది కానే కాదు. ఇంతకాలం ఇన్ని విషయాల్లో నా నమ్మకాలకు విరుద్ధంగా నీ కోసం, కేవలం నీ కోసం లొంగాను. నువ్వు నా కోసం ఒక్కసారి ఎందుకు లొంగలేవూ అని.'
'ఈ లొంగడాలవీ మీ నాస్తికులకే వచ్చు. మా ఆస్తికులకి రావు బాబూ. మీరు 'ఫరవాలేదులే' అనో, మరోలాగో, మా కోసం అనో, మరో దాని కోసం అనో లొంగుతూ ఉంటారు. నమ్మకం లేకుండా ఎవరికోసమో గుడికి వెళ్లే నాస్తికులని చూడగలరు గానీ, గుడిని తగలబెట్టాలనే నాస్తిక సభలకి వెళ్లే ఆస్తికులని మీరెరుగుదురా? ఆ మనుషులతో సంబంధాలన్నా తెంపుకుంటాం గానీ అటువంటి సభలకి పోము బాబూ.'
ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది మోహన్కి.
'తెలివితక్కువగా అయినా చాలా కరెక్టుగా చెప్పావు. ఈ విధంగా మనుషుల కోసం లొంగడం అనే విషయం నాస్తికులే చేస్తున్నారు. ఆస్తికులు మాత్రం లొంగరు. లోపం నాస్తికుల్లోనే ఉంది. మా భావాల మీద మాకే గట్టి పట్టుదల లేదు. మా జ్ఞానంలో ఎక్కడో లోపం ఉంది. ఈ లోపాల్ని మేం సవరించుకోవడం లేదు గాబట్టి, మేం అంటే ఏ మాత్రమూ గౌరవం లేకుండా పోతోంది మీకు. నిజమే ముందరగా మారవలసింది మేమే.'
ఆ రోజు నుంచీ సునంద ప్రసాదం పెట్టినా తీసుకోవడం మానేశాడు. తన జ్ఞానాన్ని నాస్తికత్వానికే పరిమితం చెయ్యకుండా ఆస్తికత్వానికి గల మూలకారణల గురించి కూడా తెలుసుకోవడం మొదలెట్టాడు.