ఉగ్రవాదం – చేతకాని పరిపాలన:
ఉగ్ర వాదులు నిర్దాక్షిణ్యంగా మారణహోమం సాగించేరు.న్యాయం గురించి, న్యాయం కోసం పొద్దున్నే న్యాయస్థానానికి వచ్చిన పౌరులు విశ్వ న్యాయాధికారిని చేరున్నారు!
గాయపడినవారూ, అసువులు బాసిన వారి కుటుంబీకులే కాదు వార్త విన్న ప్రతి భారతీయుడి మనసు కలతబారింది.
వార్త విన్న వెంటనే చలించిపోయినా తర్వాత తొందరగానే కోలుకున్నాను. ధైర్యమూ వచ్చింది.ఎందుకంటారా?
మన గృహ మంత్రి శ్రీ చిదంబరంగారు ఈ ఉగ్రవాద చర్యని తీవ్రంగా ఖండించారు.
లోతుగా విచారించటానికి ఎన్ ఐ ఏ కి భాద్యతలు అప్పగించేరు !
ప్రధాన మంత్రిగారు ఈ చర్యకి బాధ్యులైన ఉగ్రవాదులని ఏమైనా సరే వదిలేది లేదని ఉద్ఘాటించేరు!
అందు చేత నాకు ఎనలేని ధైర్యం కలిగింది.
సాక్షాత్తూ దేశ ప్రధాని హామీ ఇచ్చిన తర్వాత, దేశ గృహ మత్రిగారు ఆశ్వాసించిన తర్వాత మనకిక భయమేమిటి? దోషులు తప్పకుండా పట్టుబడతారు శిక్షింపబడతారు కూడా! అణుమత్రం సందేహం లేదు.
ప్రతిమాటూ ఘటనా స్థలిలో బోనులో పడ్డ ఎలుకలగా ముంబై తాజ్ మహల్ హోటల్ సంఘటనలో వాడెవడో చిక్కినట్లు అక్కరలేదు.
ప్రధాని వొదలం అన్నారు. వదలదు ప్రభుత్వం అంతే. మరో మాటలేదు!
అంతే కాదు మనం అందరం సమైక్యంగా వుండి దేశాన్ని ఇలాంటి విపత్తుల నుండి కాపాడాలని కూడా మన భ బాధ్యతలని గౌ. గృహ మంత్రి గారు గుర్తుచెసేరు!
‘ అంటే ఇంతకు ముందు ఢిల్లీలో జరిగిన అర డజను దాడులు, హైదరాబాదులో జరిగిన గోకుల్ చాట్,
లుంబినీ పార్కు, మక్కా మసీదు పేలుళ్ళు, ముంబైలో జరిగిన ఝవేరీ బజారు , తాజ్ మహల్ హోటల్ పేలుళ్ళూ, జైపూర్, వారణాసి , లక్నౌ… చెప్పుకుంటూ పోతే కొండవీటి చేంతాడులా పెరిగిపోయే ఉగ్రవాద దాడులన్నీ కేవలం పౌరుల్లో సమైక్యత లెకపోవటం వలన మాత్రమే జరిగేయని ప్రభుత్వ ఉద్దేశమా?’ అని అడిగే కువిమర్శకుల మాటలు నేను పట్టించుకోను. వాళ్ళు కేవలం విమర్శించటమే పనిగా పెట్టుకునే పని లేని మంగళ్ళు!
లేకపోతే ఏమిటండీ! ఈ దేశ అనధికార రాజకుమారుడూ, సాక్షాత్తూ ప్రధాని గారిచేతే అనిపించుకున్న భవిష్యత్ ప్రధాన మంత్రీ అయిన శ్రీ రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పేరు ” ఉగ్రవాద దాడులని ఆపటం ప్రభుత్వం వల్ల కాదు ” అని.
అలాంటప్పుడు గతంలో జరిగిన దాడులని వరుస పెట్టి ఏకరు పెడితే ఏమిటి అర్ధం?
కోడిగుడ్డుకి ఈకలుపీకటమే గదా. బుద్ధి వుందా వీళ్ళకి? ఇదా సమయం? అవతల దేశం గురించి ప్రధాన మంత్రీగృహ మంత్రి అంత తీవ్రంగా బాధపడుతుంటే విపత్కర సమయాల్లో విమర్శలేమిటి? అంతా సద్దుమణిగిన తర్వాత మాట్లాడవచ్చు కదా.
” కాలం గడిచేసే సరికి సామాన్యులు నిత్యజీవితంలో పడి అడిగే అవకాశమే వుండదు, అదేనా కావల్సింది? దానితో ప్రభుత్వం చేతులు కడిగేసుకుంటుందా? ” అంటాడు మా శంకరం.
వాడు చెప్పడు కానీ చిన్నప్పుడు కాకీ నిక్కర్లు వేసుకుని కఱ్ఱ పుచ్చుకు తిరిగేవాడని నా నమ్మకం.
“ఇది వితండ వాదం. ఇప్పుడు దారుణం జరిగిన వెంటనే గృహ మంత్రి గారు స్పందించిన తీరు చూస్తేనే వారు విషయాన్ని ఎంత తీవ్రంగా పరిగణించారో అర్ధం కావటం లేదూ?”
“ఆయన హోం మినిస్టరా ఇంటెలిజెన్స్ మినిస్టరా?”
“అదేమిటి?”
“లేకపోతే ఏమిటి? పేలుళ్ళు సంభవించినప్పుడల్లా అయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాష్ట్రాలకి అందజెసేం అంటాడు, అక్కడికి ఆయన భాద్యత అంతవరకేనన్నట్లు . అన్ని రాష్ట్రాలవాళ్ళూ వాళ్ళ భద్రత వాళ్ళే చూసుకునేటట్లైతే మరి కేంద్రం ఏమి చేస్తుందట? రాష్ట్రాలతో చర్చించి , పర్యవేక్షించి దేశ సమగ్రత, సమైక్యత కాపాడటం కేంద్ర గృహ మంత్రి భాద్యత కాకపోతే ఇంకేమిటి ? అంతే కాదు ఆయన అందించే సమాచారంలో ఎక్కడ, ఎవరు,వగైరాలేమీ వుండవు. ఉగ్ర వాదులెవరో మీ రాష్ట్రంలో ఎప్పుడో పేలుళ్ళకి తెగబడే అవకాశం ఉంది అని మాత్రమే . ఇంత ‘వివరమైన’ సమాచారంతో ఎవరు మాత్రం చెయ్యగలిగిమేమిటి? అందుకేనేమో మీ యువరాజు గారు ఉగ్రవాద దాడులని ఆపలేము అన్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్!”
ఇలాంటి వ్యాఖ్యలకి మాట్లాడేదేమి వుంటుంది?
“ఆయన మాటలు వింటుంటే దాడి జరిగినందుకు బాధ పడుతున్నట్లు వుండదు. కేవలం తను సరీగా పనిచెయ్యక పోవటం బయటపడుతున్నట్లుందేమోనని నెపం ఇంకొకరి మీదకు తోసెయ్యటం అత్యవసరం అన్నట్లుగా వుంటుంది.
ప్రభుత్వ పరిశ్రమలలో సొంత ప్రతిభ లేని మేనేజరు ప్రక్క డిపార్ట్మెంటు మెనేజర్ మీదకి తన వైఫల్యాలని నెట్టి తన పనితీరు బాగుందని మెప్పు పొందినట్లుగా ప్రవర్తిస్తాడు . ఈ రోజుకీరోజు సీ సీ టీ వీ లు అమర్చకపోవటం పీడబ్ల్యూడి శాఖ పని చెయ్యకపోవటమేనని ఆయన చెప్పటమే కాక ఆ శాఖ అధికారులు నిర్ణయాలు తీసుకోవటంలేదని అందుచేత పేలుళ్ళకి బాధ్యత వారిమీదకి తొసేసేరు. అంతేగాని ఆ పని జరిగేలా చూడటంలో తను పూర్తిగా విఫలం అయ్యాడని తెలుసుకో లేదు వప్పుకోలేదు! అదీ చిదంబరం !”
“దోషులని వదలము అని చెపుతూ దాడులని తీవ్రంగా ఖండించేరు గదా చిదంబరం గారు.”
“ఇప్పటికి ఎన్ని సార్లు చెప్పలేదు అయనా, ప్రధాని ఆమాటలు . దాడులు జరిగిన ప్రతిమాటూ వాళ్ళు చెప్పేది అదే మాట . కాని ఇంతవరకూ దోషులని ఎవరినీ పట్టుకోని దాడులకి లెక్కలేదు . దొరికిన ద్రోహులని కూడా శిక్షించకుండా, ఎవరో ఓట్లు వెయ్యరేమో అన్న భ్రమలో, తాత్సారం చేస్తూ ఆ ఉగ్రవాదులని ఇంటి అల్లుళ్ళలాగా వాళ్ళ గొంతెమ్మ కోరికలు కూడా తీరుస్తూ ఉండటంలో మన దేశ ప్రభుత్వం యొక్క బలహీనతనీ, అలసత్వాన్ని ప్రపంచం అంతటికీ చాటుతున్నప్పుడు మనదేశం అంటే ఎవరికి గౌరవం, భయమూ ఉంటాయి! అందు చేతనే తరచుగా ఈ దాడులు!
“అంతే కాదు, మౌఢ్యం కరుడుకట్టిన మతఛాందస దేశాధినేతలో/వ్యక్తులో కొందరు కావించే మారణ హోమానికి ఇస్లామిక్ ఉగ్రవాదం అనిపేరు పెట్టి వ్యవహరించే అమెరికన్ ఆలోచనా సరిళికి దాసోహం అయి, ఉగ్రవాదానికి ఆ మతానుయాయులందరూ కారణం అనేంతటి స్థితికి దిగజారిన రాజకీయం ఎంతటి హేయమైనది? ఆ మతానికి చెందిన మన దేశ ప్రజలందరినీ అల్పులుగా పరిగణిస్తూ వారిని అవమానిస్తున్నట్లుగా వాళ్ళని ఓటు బేంక్ గా జమకట్టి, మరెవరో మతితప్పిన వ్యక్తులు చేసిన తప్పిదం గురించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి హిందూ ఉగ్రవాదం అన్న పేరును పెట్టి వ్యవహారంలో కి తీసుకొద్దామన్న ప్రయత్నం చేసే మన మంత్రి మంత్రిగారు హిందువులకే కాదు ముస్లీం సొదరులకీ మొత్తం దేశానికే తీరని ద్ర్రోహం చేస్తున్నారు! ఎన్నికలలో గెలుపుకోసం, పదవులకోసం రాజకీయ నాయకులు విడతీద్దామనుకున్నంతగా రెండుమతాల సామాన్య జనులు ఎవ్వరూ విడిపోలేదని నా ప్రగాఢవిశ్వాసం! రెచ్చగొట్టబడినప్పుడు తాత్కాలికంగా గీత దాటి ప్రవర్తించటం ‘మూక మనస్తత్వం’ . దానికి మతంతో ప్రమేయం లేదు . ఇస్లామిక్ ఉగ్రవాదం అంటే హిందువులు సంతోషిస్తారని, హిందూ ఉగ్రవాదం అంటే ముస్లీములు సంతోషిస్తారనీ అనుకొవటం కేవలం ఆనాయకుల అల్పబుధ్ధిని బయటపెట్టుకోవటమే అవుతుంది!”
అవునేమోనన్న అనుమానం నాకూ కలిగిన మాట వాస్తవం. అందుచేత నేను నోరు విప్పాల్సిన అవసరం నాకు కనపడ లేదు.
“అల్లాంటి నేతల మాటలు విని నీకు ధైర్యం కలగటం నీ గొప్పతనం. నీ లాంటి గొప్పవాళ్ళు ఎంత మంది ఈ దేశంలో వున్నారో అని నా విచారం .
“వాళ్ళని భగవంతుడే కాపాడాలి !”
నేనూ తీవ్రంగా అలోచించవలసిన విషయమేనేమో ఇది !!